హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో విడుదలైన జూలై 24 నాటికి ఉన్న పరిస్థితులను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే ముందు తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ రెవెన్యూశాఖలోని ఆఫీస్ సబార్డినేట్స్ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. ప్రతివాదుల జాబితా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, సీసీఎల్ నవీన్మిట్టల్, కేంద్ర ఎన్నికల సంఘాలను తొలగించాలని పిటిషనర్ను ఆదేశించారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.