New High Court | వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 22: విద్యార్థుల, ప్రజాసంఘాల పోరాటం పట్టలేదు.. ప్రతిపక్షాల సూచనలనూ వినలేదు.. పర్యావరణ వేత్తల సలహాలు పాటించలేదు.. బార్ అసోసియేషన్ ప్రశ్నలు, వర్సిటీల వినతులు పట్టించుకోనేలేదు.. తాను కోరిందే వేదంగా భావించిన ప్రభుత్వం రాత్రికి రాత్రే హైకోర్టు పనులకు శ్రీకారం చుట్టడం విమర్శలకు తావిచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 40 ఏండ్ల చరిత్రను నీరు గార్చి, వర్సిటీ భూముల్లోని సహజ వనరులను తొలగించే పనిలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నిమగ్నమైంది. భారీ వన సంపదను నాశనం చేస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఏండ్ల తరబడి పెంచిన తల్లిలాంటి వనమూలికలు, ఔషధ, వివిధ పండ్ల తోటలు, పలురకాల వనాలను కూల్చివేస్తున్నారు. శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వాటిని తొలగించేదుకు జేసీబీ, హిటాచి లాంటి భారీ యంత్రాలను తరలించారు. ఉద్యమకారులు అడ్డుపడకుండా ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎంకు ప్రత్యేక ఆసక్తి: బార్ అసోసియేషన్లు
ఇంకో వందేండ్ల వరకు సేవ చేసే భవనాన్ని వదిలి, కొత్త భవనం కట్టాల్సిన అవసరమేమిటని వివిధ బార్ అసోసియేషన్లు ప్రశ్నించాయి. దీనిని ఏకపక్షంగా, తొందరపాటు చర్యగా అభివర్ణించాయి. ఇప్పుడున్న చోట రూ.100 కోట్లు కేటాయించి కనీస వసతులు కల్పిస్తే సరిపోతుందని సూచించారు. దీనివెనుక సీఎంకు ప్రత్యేక ఆసక్తి ఉన్నదని, రియల్ బూమ్ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తే దాదాపు రూ.వెయ్యి కోట్లు వృథా అవుతాయని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల భూములను బలవంతంగా వారి నుంచి లాక్కొని హైకోర్టు భవనాలు కట్టడం భావ్యం కాదన్నారు. అటు రైతులకు, వ్యవసాయ పరిశోధనలకు, వర్సిటీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. హైకోర్టును ఇక్కడే కొనసాగించాలని, జీవో నం.55ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్కు ఊపిరితిత్తులు
బయో డైవర్సిటీ పార్కును, పరిశోధనా భూములను నేలమట్టం చేయడానికి ఏ ముందు చూపు ఉన్నవారైనా అంగీకరించరని మేధావి వర్గం సూచించింది. 100 ఎకరాల బయో డైవర్సిటీ భూమి విలువ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని, అవి హైదరాబాద్ ప్రజల ఊపిరితిత్తులు అని వారు పేర్కొంటున్నారు. హైదరాబాద్ ప్రజలకు విలువైన ఆక్సిజన్ను అందిస్తున్నాయని చెప్పారు. ఈ చర్యతో మనం చరిత్రహీనులుగా మిగిలి పోతామని హెచ్చరించారు. భవిష్యత్తు తరాలకు వర్సిటీ ప్రాముఖ్యత పుస్తకాలకే పరిమిత మవుతుందని ఆందోళనతో విద్యార్థి సంఘాలు దాదాపు రెండు నెలలపాటు ధర్నాలు, నిరసనలు తెలిపారు. వాటిని పెడచెవిన పెట్టిన ప్రభుత్వం సహజ వనరులను నాశనం చేసి చరిత్ర పుటానికి ఎక్కబోతుందనేది సత్యమని వివిధ వర్గాలు భావిస్తున్నాయి.