Gadwal | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయనపై ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్పై తుది ఉత్తర్వు లు జారీ చేస్తూ, డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్రెడ్డికి రూ.2.50 లక్షలను జరిమానా విధించింది. పిటిషనర్కు ఖర్చుల నిమిత్తం రూ.50 వేలను చెల్లించాలని కూడా ఆదేశించింది.
తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వెల్లడించారు. గురువారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. తనపై నాలుగు అభియోగాలతో ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లారని, తీర్పుపై తాను వ్యాఖ్యానించబోనని, తీర్పు ప్రతులు వచ్చాక న్యాయనిపుణులతో సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచానని, ఈసారి పక్కాగా 50 వేల ఆధిక్యత సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం లో ప్రజల తీర్పే అంతిమమని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక కొం దరు దొడ్డిదారిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకమున్నదని, అంతిమంగా న్యా యం తనకే దక్కుతుందని చెప్పారు.