హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన తీరు మారాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల కోసం పోలీసులు ఉన్నారని, పోలీసుల కోసం ప్రజలు లేరని వ్యాఖ్యానించింది. విధుల నిర్వహణతోపాటు ప్రజలతో ఎలా వ్యవహరించాలన్న దానిపై పోలీసులకు సర్క్యులర్ జారీ చేయడంతోపాటు వారికి అవగాహనా తరగతులు నిర్వహించాలని, పౌరసేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని డీజీపీకి సూచించింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ జడ్జి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణకు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వో ఓదెల వెంకటేశ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ వాదిస్తూ.. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 14న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ విషయంలో జాప్యం జరిగినందుకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నామని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని, ఎఫ్ఐఆర్ నమోదులో పోలీసులు జాప్యం చేయడాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. ప్రజలు ఊరికే పోలీస్ స్టేషన్కు రారని, సమస్య ఉంటేనే వస్తారని పేర్కొంటూ.. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని గుర్తు చేసింది. ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిందేనని, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్హెచ్వోను ఆదేశించింది. ఈ విచారణ అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్పై తదుపరి విచారణ అవసరం లేదని ప్రకటించింది.