హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది. వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ సయ్యద్ ఇఫ్తికార్ హుస్సేనీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీ ఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.
వక్ఫ్ బోర్డు ఇన్చార్జి సీఈవోగా అసదుల్లా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదంటూ తీర్పు ఇవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ ఇఫ్తికార్ హుస్సేనీ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీల్పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వక్ఫ్ బోర్డు సీఈవోగా ఉండే అధికారికి నిర్ధేశించిన అర్హతలు ప్రస్తుతం ఫుల్టైమ్ అదనపు చార్జితో కొనసాగుతున్న అధికారికి ఉన్నాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తిస్థాయి సీఈవోను నియమించే ఉద్దేశం ఉంటే ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.