హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): బ్యాంకుకు తాకట్టు పెట్టిన భూమిలోని సమాధులను తరలించాలంటూ ఐడీబీఐ బ్యాంక్ చేసిన వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మరణించినవారికి హకులుండవా అంటూ నిలదీసింది. జీవించినవారితో సమానంగా మరణించినవారికీ హకులుంటాయని వ్యాఖ్యానించింది.
మెలాంజ్ క్లోతింగ్ లిమిటెడ్ తీసుకున్న రూ.3.90 లక్షల టర్మ్ లోన్ చెల్లించకపోవడంతో హైదరాబాద్ నాదర్గుల్లో తాకట్టు పెట్టిన 2,100 చదరపు గజాలను వేలం వేశామని, అక్కడ ఉన్న సమాధులను తరలించి స్థలాన్ని ఇప్పించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఐడీబీఐ బ్యాంక్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. బ్యాంకు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కంపెనీ రుణం చెల్లించకపోవడంతో వారు తాకట్టు పెట్టిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ సమాధులున్నాయని చెప్పారు.
గత ఏడాది వేలం వేసిన ఈ భూమిని కొనుగోలు చేసిన వారికి అప్పగించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టాల కింద శ్మశానవాటికకు గుర్తింపులేదని చెప్పారు. ఖననం చేసిన మృతదేహాలను గుర్తింపు పొందిన శ్మశానవాటికకు తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాలంటూ పోలీసులు, జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను జూలై ఒకటికి వాయిదా వేశారు.