హైదరాబాద్, ఫిబ్రవరి 28 : కొవిడ్ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచనావేసి, తదనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టిందని ప్రశంసించింది. కొవిడ్పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో ఉన్నందున, ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపడుతున్నందున పిల్స్పై విచారణ ముగించాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేసిన విజ్ఞప్తిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. కొవిడ్ వల్ల ఎంతమంది మరణించారు? ఎంతమంది మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు? ఇంకా ఎంతమందికి చెల్లించాలి? అన్న దానిపై పూర్తి వివరాలను నివేదించేందుకు 6 వారాల గడువు ఇవ్వాలని ఏజీ కోరడంతో హైకోర్టు అనుమతించింది.
కొవిడ్ బెడ్స్ ఖాళీ
కొవిడ్ బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన 56,265 పడకల్లో ప్రస్తుతం 971 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, మిగిలినవన్నీ ఖాళీగా ఉన్నాయని వైద్యశాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో కొవిడ్ థర్డ్ వేవ్ తీవ్రత తగ్గడంతో విద్యాసంస్థలను తెరిచామని, తరగతులకు భౌతికంగా హాజరుకాలేని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించామని విద్యాశాఖ తెలిపింది.