హైదరాబాద్ : రాష్ట్రంలో మనుషుల అదృశ్యం కేసుల నమోదు, వాటి దర్యాప్తులో పురోగతిని నివేదించాలని పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఇంతవరకు ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది ఆచూకీ తెలుసుకున్నదీ తదితర వివరాలు అందజేయాలని ఆదేశించింది. వీటితోపాటు 2006లో అదృశ్యమైన యువకుడి కేసు ఏ స్థాయిలో ఉందో చెప్పాలని కూడా హోంశాఖను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్లతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
తన సోదరుడు ఎన్.సీతారాములు 19 ఏండ్ల వయసుండగా 2006లో రామంతపూర్, పాలిటెక్నికల్ కాలేజీలో రెండో ఏడాది చదువుతుండగా మిస్సయ్యాడని, ప్రస్తుతం అతని వయసు 35 ఏండ్లని, ఆతని ఆచూకీ కోరుతూ సోదరుడు ఎన్.శ్రీరాములు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కల్వకుంట్ల గ్రామస్తుడు శ్రీరాములు ఉప్పల్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఏపురోగతి లేదని, పలు ఫిర్యాదులు చేసినా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం కూడా ఇచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ వినతిపత్రాన్ని హైకోర్టు 2006లో సుమోటోగా రిట్గా పరిగణించి జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో తాజాగా హెబియస్కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడి ఆచూకీని పోలీసులు కనుగొనేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తన సోదరుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చునని పిటిషనర్ భయాందోళనలను వ్యక్తం చేశారు. వాదనల తర్వాత ప్రతివాదులైన హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాచకొండ కమిషనర్, మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్, ఉప్పల్ ఎస్హెచ్ఓలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్కు వాయిదా వేసింది.