సికింద్రాబాద్ : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి ( Peace Rally ) అనుమతించాలని హైకోర్టు( High Court ) సోమవారం పోలీసు శాఖను ( Police Department ) ఆదేశించింది. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు గత నెల 21 వ తేదీన చేసిన దరఖాస్తు పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించింది.
అవసరమైతే లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులతో సంప్రదించి తగు నిబంధనలు రూపొందించి పూర్తి నివేదికను ఈ నెల 5 వ తేదీ లోగా సమర్పించాలని హై కోర్టు 13 వ బెంచ్ న్యాయమూర్తి తుకారాం జీ పోలీసు శాఖను ఆదేశించారు. లష్కర్ జిల్లా సాధన సమితి తరపున సీనియర్ న్యాయవాది ముఖీద్ వాదనలు వినిపించారు.
గత నెల 17 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కోసం పోలీసు శాఖను అనుమతి కోరగా, చివరి నిమిషంలో పోలీసు అధికారులు నిరాకరించారు. దీంతో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ జనవరి 21న నగర పోలీసు కమిషనర్, మల్కాజిగిరి డీసీపీలకు శాంతి ర్యాలీకి అనుమతించాలని కోరుతూ మరోమారు దరఖాస్తు చేశారు.
ఈ దరఖాస్తు పై పోలీసు శాఖ నుండి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 7 వ తేదీన ర్యాలీకి అనుమతించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు హై కోర్టును ఆశ్రయించగా సోమవారం హైకోర్టు సానుకూలంగా స్పందించింది.