హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుమ్రుక్నుదౌలా ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మట్టి, ఇతర సామగ్రిని తొలగించాలని ఓ పిటిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ పిటిషనర్ తొలగించకపోతే వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హైడ్రా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో సర్వే నం.42లో 3.03 ఎకరాలు, సర్వే నం.50/1లో 9.24 ఎకరాలను కొనుగోలు చేశానని, ఇందులో జోక్యం చేసుకోకుండా హైడ్రాతో సహా అధికారులను ఆదేశించాలని మహ్మద్ ఇబ్రహీం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మరో ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, దీనిపై సివిల్ కోర్టు ఆదేశాలున్నాయని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి చెరువులో వేసిన మట్టిని పిటిషనర్ సొంత ఖర్చుతో తొలగించాలని ఆదేశించారు.