హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింది. ఈడీ కేసును కొట్టేయాలని కోరుతూ నామా దాఖలు చేసిన రిట్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారించారు. రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, మధుకాన్ గ్రూప్ కంపెనీలతో పిటిషనర్కు సంబంధం లేదని నామా సీనియర్ న్యాయవాది టీ నిరంజన్రెడ్డి వాదించారు.
ఆ సంస్థల్లో డైరెక్టర్ లేదా ఉద్యోగి కూడా కాదన్నారు. 2009లోనే మధుకాన్ గ్రూప్నకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈడీ చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకిరణ్రెడ్డి వాదిస్తూ, అరెస్టు కాకుండా నామా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు పొందారని, ఆ తర్వాత నామాకు వ్యతిరేకంగా చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని, ఆస్తుల జప్తు మాత్రమే జరిగిందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.