హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రత చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గత ఏడాది మార్చి 29న జారీ చేసిన మార్గదర్శలు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని పిల్ దాఖలైంది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రోడ్డు భద్రత చర్యలు తీసుకోకపోవటంతో మ్యాన్హోల్స్, డ్రైనేజీలు, రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉన్నదని పిటిషనర్ తెలిపారు. వాదనల విన్న హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.