హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసి బేబి పాండ్స్లో వాటిని నిమజ్జనం చేయాలని చెప్పింది. అయితే, గతేడాది దీనికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీ చేశాయి. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వినాయక విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు.
కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్లో నదులు, చెరువులు ఎక్కువగా లేనందున సమస్య తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది. బెంగాల్ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో అక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సూచించింది.