హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తాగునీటి కాలుష్యాన్ని ప్రజలందరికీ చెందిన సమస్యగా పరిగణించాలని, ప్రభుత్వ శాఖలన్నీ సమష్టి బాధ్యతతో తాగునీటి కాలుష్యాన్ని నివారించాలని హైకోర్టు ఆదేశించింది. నీటిని శుభ్రపరచకుండా ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాలుష్యమంటే కేవలం బ్యాక్టీరియా కాదని, అందులో ఉన్న హానికర లోహాలను కూడా కాలుష్యంగా పరిగణించాలని పేర్కొన్నది. దీన్ని కేవలం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు సంబంధించిన అంశంగా పరిగణించి మిగిలిన శాఖలు ఉదాసీనంగా వ్యవహరించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది వీ వివేక్రెడ్డిని అమికస్ క్యూరీగా నియమిస్తునట్టు ప్రకటించింది. ఆయనకు సంబంధిత అధికారులు రికార్డులన్నీ అందజేయాలని ఆదేశించింది. హైదరాబాద్, సికింద్రాబాద్కు సరఫరా చేసే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల నీటి నాణ్యత తగ్గుతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రాసిన లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జలమండలి, జీహెచ్ ఎంసీతోపాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది.
మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు ; హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, మల్దకల్లోని జూనియర్ కళాశాలతోపాటు ప్రభు త్వ జూనియర్ కాలేజీల్లో మరుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జూనియర్ కాలేజీలకు రూ.27.55 కోట్లు, జడ్పీ పాఠశాలకు రూ.26 లక్షలు కేటాయించినట్టు నివేదించింది. దీంతో ఆయా మరుగుదొడ్ల నిర్మాణంపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.