హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పంపిణీ హకుల వివాదం నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో పంపిణీదారు జీ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు 2016లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టేయాలంటూ వార్నర్ బద్రర్స్ పిక్చర్స్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్ తుకారాంజీ పైవిధంగా తీర్పు చెప్పారు. పంపిణీ హకుల వివాదానికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణ హామీ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. ఫిర్యాదుదారుకు చట్టప్రకారం సివిల్ వివాదంలో పరిహారం పొందే హకు ఉందని వెల్లడించారు.
హైదరాబాద్, మే21 (నమస్తే తెలంగాణ): పెట్టుబడిదారులను మోసం చేశారన్న ఆరోపణలపై ఈడీ నమోదు చేసిన కేసులో.. నౌహీరా షేక్పై ఈడీ ప్రత్యేక కోర్టు జారీచేసిన నాన్-బెయిలబుల్ వారంట్ను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ వివరణ తెలుసుకున్న తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయగలమని గురువారం జస్టిస్ ఈవీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఈ నెల 7న ఈడీ ప్రత్యేక కోర్టు నాన్ -బెయిలబుల్ వారంట్ జారీచేసింది.
దీని రద్దు కోరుతూ నౌహీరా షేక్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది ఏ పద్మాచారి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, వేలంలో 16 ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడానికి పిటిషనర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని, అయినప్పటికీ దిగువ కోర్టు బెయిలుకు వీలులేని వారంట్ జారీ అన్యాయమన్నారు. కిందికోర్టు ఇచ్చిన నాన్బెయిలబుల్ వారంట్ అమలుపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు.