Revanth Reddy | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పీసీసీ చీఫ్ ఏ రేవంత్రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతంలో పోలీసుల భద్రత ఉన్నప్పుడు ఆయనకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు భద్రత కల్పించేలా ఉత్తర్వు ఇవ్వాలని రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి విచారించారు.
తొలుత ప్రభుత్వ న్యాయవాది ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ, రేవంత్ పాదయాత్ర చేసే ప్రాంతాల్లో భద్రత కల్పించాలని సంబంధిత జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అందువల్ల రేవంత్కు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ పంపిన సమాచారాన్ని హైకోర్టుకు నివేదించారు. గత నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభమైందని, అదే నెల 4న తనకు అదనపు భద్రత కల్పించాలని రేవంత్ డీజీపీకి ఈ-మెయిల్ పంపిన వెంటనే సంబంధిత అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక పిటిషన్పై వాదనలు కొనసాగించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి కోర్టు వచ్చింది. ఈ దశలో రేవంత్రెడ్డి తరుపు న్యాయవాది టీ రజనీకాంత్రెడ్డి కల్పించుకుని అదనపు భద్రతకు ఉత్తర్వు ఇవ్వాలని పలుమార్లు కోరటంతో విచారణను 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.