హైదరాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై గత ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దివ్యాంగుల రిజర్వేషన్ల నిబంధనలను సవరిస్తూ 2018లో జారీచేసిన జీవో 10, 2019లో జారీచేసిన జీవో 96, ఈ ఏడాది వెలువడిన జీవో 29ని సవాల్ చేస్తూ ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జీ రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టును ఆశ్రయించడంలో సుదీర్ఘ జాప్యం జరిగిందని తప్పుబట్టింది. జాప్యానికి కారణాలను వివరించలేదని ఆక్షేపించింది. పిటిషనర్లు, ప్రభుత్వ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వెలువరిస్తూ.. ‘2022లో వెలువడిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దయిందని, తీంతో గత ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని గుర్తుచేసింది. గత జులై 7న తుది కీ వెలువడిందని, మెరిట్ జాబితా వెలువడ్డాయక పిటిషనర్లు కోర్టుకు వచ్చారని తప్పుబట్టింది. జీవో 29ని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల ఆలస్యమైందన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నది. ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ అయ్యాక సమాచార హకుచట్టం కింద జీవో కాపీని పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నాలు చేయలేదని తప్పుబట్టింది. గత నోటిఫికేషన్ మేరకు పరీక్ష నిర్వహించాలనే పిటిషన్లను గతంలోనే హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి పాత నోటిఫికేషన్ మేరకు నిర్వహించాలనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదని, అందుకే పిటిషన్లను కొట్టేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. తమ తీర్పులో వెబ్నోట్, డీకోడింగ్ వెబ్నోట్ అంశాల జోలికి వెళ్లలేదని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తదనంతర పరిణామాలపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
గత జీవోల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు పిలవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. రిజర్వేషన్ క్యాటగిరీకి చెందిన వారిని మెరిట్ జాబితాలో చూపడం అన్యాయమని పేర్కొన్నారు. ఉదాహరణకు 200 జనరల్ క్యాటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో 10,540 మందిని మెయిన్స్కు ఎంపిక చేశారని, అదేవిధంగా అన్ని క్యాటగిరీలకూ ఎంపిక చేయాలని, కానీ, అందుకు విరుద్ధంగా జాబితాను సిద్ధంచేశారని పేర్కొన్నారు. 2022లో జారీచేసిన చేసిన నోటిఫికేషన్ మేరకు పరీక్షలను నిర్వహించాలని కోరారు. ఆ నోటిఫికేషన్లో 503 పోస్టులు ఉంటే ప్రస్తుతం 563 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని తెలిపారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమ్స్లో అక్రమాలు జరిగాయని చెప్పి వాటిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఆ తర్వాత టీజీపీఎస్సీ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసిందని, ఆపై ఉపసంహరించుకున్నదని చెప్పారు. తాజాగా గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు. అప్పటికే నియామక ప్రక్రియకు సంబంధించి ఫిబ్రవరి 8న జీవో 29 వెలువరించిందని తెలిపారు. తొలి నోటిఫికేషన్ వెలువడ్డాక నిబంధనలు మార్చడానికి వీల్లేదని తెలిపారు. నిబంధనలు సవరించడం వల్ల పిటిషనర్లకు ఎలాంటి నష్టం జరగడం లేదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. రిజర్వేషన్ క్యాటగిరీకి చెందిన వారు మెరిట్ జాబితాల్లో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వుడు క్యాటగిరీగానే పరిగణింపు జరుగుతుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పరిగి, డిసెంబర్ 26: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడిన మాటలపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నరేందర్రెడ్డి వ్యాఖ్యలు బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెయిల్ రద్దుకు పిటిషన్ వేస్తామని వెల్లడించారు.