హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున చట్టప్రకారం ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా జుకల్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి షెడ్యూల్డ్ కులానికి చెందిన వారో కాదో విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.
కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాదని, తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారామ్పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపి, పిటిషన్ ను కొట్టేసింది.