ED | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఏదై నా నేరం జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చునా.. అని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డీఆర్ఎస్ఐ ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయడంపై సందేహాన్ని లేవనెత్తింది. బంగారం దిగుమతుల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అభియోగాలపై డీఆర్ఎస్ఐ నోటీసులు జారీ చేసిందని, దాని ఆధారంగా శ్రీకృష్ణ జ్యూవెలర్స్, దాని అనుబంధ కంపెనీలు, వ్యక్తులపై నమోదు చేసిన కేసు రికార్డులను నివేదించాలని ఈడీని ఆదేశించింది.
రూ.700 కోట్ల విలువైన 1,800 కిలోల బంగారం దిగుమతుల్లో అక్రమాలు జరిగినట్టు శ్రీకృష్ణ జ్యువెలర్స్కు డీఆర్ఎస్ఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులను ప్రాతిపదికగా చేసుకొన్న ఈడీ శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఇతర పిటిషనర్ల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. జప్తు ఖాతాలను స్తంభింపజేయడాన్ని అడ్యుడికేటింగ్ అథారిటీ నిరుడు సమర్థిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిని శ్రీకృష్ణ జ్యూవెలర్స్, ఇతరులు హైకోర్టులో సవాల్ చేయగా, బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది.