High Court | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. ఉచితాలను ధారాదత్తం చేయడానికి వెనుకాడటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరుగానీ ఉచిత పథకాల పేరుతో మాత్రం రూ.కోట్లు పంపిణీ చేస్తారని ఆక్షేపించింది. బిల్లులు చెల్లించాలని తాము జారీచేసిన ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆ ఉత్తర్వులను ఎలా అమలుచేయించాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి రూ.28.97 కోట్లు, శ్రీపాదసాగర్ పనులకు సంబంధించి రూ.76.53 కోట్లు చొప్పున బకాయిలు చెల్లించాలంటూ గత డిసెంబర్లో జారీచేసిన ఆదేశాలను అమలుచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. శ్రీపాదసాగర్ పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో నవయుగఐవీఆర్, సీఎల్ఎస్ఈడబ్ల్యూతో కూడిన సంయుక్త భాగస్వామ్య సంస్థ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన కోర్టు.. ఆ బిల్లులను పది రోజుల్లోగా చెల్లించాలని గత డిసెంబర్లో ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో ఆ సంస్థ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ జరిపారు.
ఈ సందర్భంగా బిల్లులు చెల్లించేందుకు ఏడు దశల్లో క్లియరెన్స్లు రావాల్సి ఉంటుందని, మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కోర్టుధికరణ కేసులో నోటీసులు జారీచేసి మూడునెలలు అవుతున్నదని, ఇంకో మూడునెలలు గడువు కోరడం ఏమిటని ప్రశ్నించింది. బిల్లుల క్లియరెన్స్ విధానం ఎలా ఉన్నా కోర్టు అదేశాలు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. డాక్టర్ తన దగ్గరకు వచ్చిన సాధారణ రోగికి వైద్యం చేయడానికంటే ముందు ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారని, అదేవిధంగా పనులు పూర్తిచేసిన వాటికి ప్రభుత్వం ముందుగా బిల్లులు చెల్లించాలని వ్యాఖ్యానించింది. ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణి ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణం చూపి విచారణను వాయిదా కోరడం సబబుకాదని వ్యాఖ్యానించింది. బిల్లులను ఏప్రిల్ 4లోగా చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.