హైదరాబాద్, నవంబర్ 16, (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల హకుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్- 2 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నెల 28లోపు తమ వాదనలతో కౌంటరు దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
దివ్యాంగుల హకుల చట్టంలోని సెక్షన్ 2(ఆర్) ప్రకారం 40 శాతం అంగవైకల్యం ఉన్నట్లయితే సదరు పరీక్షల్లో ప్రతి గంటకు 20 నిమిషాలు అదనపు సమయం ఇవ్వాలనే నిబంధనను అమలు చేయడం లేదంటూ పెద్దపల్లికి చెందిన ఎన్ సాయిరాం సహా నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. కేసును 28కి వాయిదా వేశారు.