హైదరాబాద్, ఏప్రిల్28 (నమస్తే తెలంగాణ): ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు మూలవేతనంపై 25 శాతం ఇన్సెంటివ్ను చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడాలేని విధంగా ఇన్సెంటివ్ చెల్లిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేసిన కేంద్ర జల్శక్తి శాఖ ఇటీవలనే బోర్డుకు లేఖ రాసింది. ఇన్సెంటివ్ చెల్లింపును వెంటనే నిలిపివేయాలని, 2020 నవంబర్ నుంచి చెల్లించిన మొత్తాన్ని కూడా ప్రతి ఉద్యోగి నుంచి రికవరీ చేయాలని బోర్డుకు ఆదేశించింది.
కేంద్ర జల్శక్తి ఆదేశాల మేరకు బోర్డు చైర్మన్ శివనందన్కుమార్ ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెల చెల్లించిన ఇన్సెంటివ్ మొత్తాన్ని ఒకే వాయిదాలో చెల్లించాలని ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి గరిష్ఠంగా రూ.12లక్షలు చెల్లించాల్సి వస్తుండగా ఆందోళనకు గురైన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. స్వయంప్రతిపత్తి కలిగిన బోర్డు నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం కేంద్ర జల్శక్తిశాఖకు లేదని, రాష్ర్టాల సమ్మతితోనే ఇన్సెంటివ్ తీసుకుంటున్నామని న్యాయస్థానానికి నివేదించారు. దీంతో సానుకూలంగా స్పందించిన హైకోర్టు ప్రస్తుతానికి బోర్డు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసి, తదుపరి విచారణను రెండునెలలకు వాయిదా వేసింది. దీంతో బోర్డు ఉద్యోగులకు ఊరట లభించింది.