హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ధనిక ఆలయమైనా డబ్బు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించింది.
నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ అఫిడవిట్లో సుముఖత వ్యక్తం చేసింది. వైల్డ్లైఫ్, టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. హైకోర్టు పర్యవేక్షణ అవసరమని న్యాయవాది పేర్కొనడంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది.