కేసముద్రం/గజ్వేల్, జనవరి 6: పత్తి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్లో పత్తి ధర రికార్డు సృష్టిస్తున్నది. గురువారం మార్కెట్లో క్వింటాల్ ధర రూ. 10,101 పలికింది. మార్కెట్కు 939 బస్తాలు విక్రయానికి వచ్చింది. కాగా, పెట్టుబడి సాయంగా రూ.50 వేల కోట్లు అందించినందుకు, మార్కెట్లో పత్తి ధర రూ.10 వేలు దాటినందుకు రైతులు సంబురాలు నిర్వహించారు. కాగా, ఖమ్మంలో 9,850, మహబూబాబాద్లో రూ.9,826, వరంగల్లో రూ.9,750 పలికింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు లో గురువారం క్వింటాల్ పత్తికి రూ.9,750 ధర పలికింది. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్కు 31 మంది రైతులు 111.65 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకొచ్చారు. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా పత్తి వ్యాపారులు అత్యధికంగా క్వింటాల్కు రూ.9,750, అత్యల్పంగా రూ.8,911 ధరను చెల్లించారు. సీజన్ ప్రారంభం నుంచి గురువారం నాటికి 1,602 మంది రైతుల నుంచి 4,684 క్వింటాళ్ల పత్తిని గజ్వేల్ మార్కెట్ కమిటీలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేశారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో 18,802 మంది రైతుల నుంచి 94,369 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.