Gas Cylinder | తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ. 500లకే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామంటూ గతంలో గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా అమలు సమయంలో మాత్రం షరతులు విధిస్తున్నది. ఈ పథకం లబ్ధి పొందేందుకు గానూ మూడు షరతులను విధించింది. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను మంగళవారం విడుదల చేసింది.
☞ ఈ ఉత్తర్వుల ప్రకారం రూ. 500లకే గ్యాస్ పొందాలంటే సదరు వ్యక్తి ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి.
☞ దరఖాస్తుదారులకు కచ్చితంగా తెల్ల రేషన్కార్డు ఉండాలి.
☞ దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
☞ ఈ పథకంలో భాగంగా వినియోగదారులకు ఇచ్చే సిలిండర్లపై పరిమితి విధించింది. గడిచిన మూడేళ్లుగా సదరు వ్యక్తి వినియోగించిన(బుక్ చేసిన) గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని సగటును లెక్కించి దాని ఆధారంగా పరిమితి సంఖ్యలోనే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు.
☞ మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే
రూ. 500లకే సబ్సిడీ గ్యాస్ పథకంలో భాగంగా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు ముందుగా గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో మొత్తం అమౌంట్ను కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ను ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే.. గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నాయి. అంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు రూ. 955 చెల్లించాల్సిందే. ఆ తర్వాత సబ్సిడీ రూ. 455 వినియోగదారుల ఖాతాలో జమవుతాయి. అయితే ఈ సబ్సిడీ అమౌంట్ ఎప్పుడు జమవుతాయనేదానిపై స్పష్టత లేదు.