హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో జిల్లా, మండల విద్యాశాఖ అధికారుల ఫోన్ నంబర్లను డిస్ప్లే చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విధులకు హాజరయ్యే సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. హాల్ టికెట్లు ఇప్పటికే పాఠశాలలకు చేరాయని వెల్లడించారు. పరీక్షల సమయంలో విద్యుత్తుకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎండ తీవ్రత దృష్ట్యా.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశావర్కర్ ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్తు, టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా చూడాలని, ముందస్తుగానే తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకొన్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్షలకు మొత్తం 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని, రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల కమిషనర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.