హైదరాబాద్ : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. హైదరాబాద్లోని బస్ భవన్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సజ్జనర్ మాట్లాడుతూ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. పండుగకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వివరించారు. జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని అన్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆయా రోజుల్లో పోలీస్, రవాణా అధికారులు సంస్థకు సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు.
ఏఏ జిల్లాలకు ఎక్కడి నుంచి బస్సులు..
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్,హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని తెలిపారు. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. గత ఏడాది ఆర్టీసీకి సహకరించిన రవాణా శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులను ఎండీ సజ్జనర్ సన్మానించారు.