హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో మంగళవారం సాయంత్రం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఈ ఘటన భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆలయ సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్లు సంచరించినట్టు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల ఉపరితలంలో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.