Revanth Reddy | యాదాద్రి భువనగిరి, మే 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం నెలకొంది. గుట్టలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం హాజరవుతుండడంతో కొండకింద హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేసింది. సీఎం రాక కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ ఇతర ముఖ్యులంతా శనివారం అక్కడే ఎదురు చూస్తుండగా టెంపుల్ సిటీ పైన ఉన్న హెలిప్యాడ్లో హె లికాప్టర్ ల్యాండ్ అయ్యింది. దీంతో 10 నిమిషాలు హెలికాప్టర్లోనే రేవంత్, మంత్రులు ఉండిపోయారు. అధికారులు పైకి వచ్చాక సీఎం బయటకు వచ్చారు.
ఈ ఘటనపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పవిత్ర వేదపాఠశాల దగ్గర అపచారం చోటుచేసుకున్నది. పూజ జరిగే ప్రాంతంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, అధికారప్రతినిధులు చెప్పులు, బూట్లు వేసుకొని తిరిగారు. వేద పాఠశాల శంకుస్థాపన సమయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిని లోపలకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. మహిళా కార్పొరేషన్ చై ర్మన్ బండ్రు శోభారాణి వెళ్తుండగా అడ్డుకొని వేరే క్యూలో వెళ్లాలని తిప్పి పంపించారు.
సెలవులు, వీకెండ్ కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. కొండపైకి వెళ్లకుండా భక్తులను కట్టడి చేశారు. కొండపైకి వెళ్లే ఉచిత బస్సు సర్వీసును నిలిపివేశారు. ప్రైవేట్ వాహనాలను వెళ్లనివ్వలేదు. సీఎం దర్శన సమయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేయడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.