Bhadrachalam | ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం 40 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జనగామ జిల్లా జాఫర్గఢ్లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్లో 17.1 సెం.మీ., మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్లో 14.1 సెం.మీ., వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.మీ., భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 11.8 సెం.మీ., కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా ఆందోలులో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటపురంలో 7.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ., హైదరాబాద్ షేక్పేటలో 6.6 సెం.మీ., ఖైరతాబాద్లో 4.7 సెం.మీ., మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో 5.6 సెం.మీ., కుత్బుల్లాపూర్లో 4.7 సెం.మీ., సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Telangana | రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు