హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో అధికారులు భూపాలపల్లి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రజలు 90306 32608 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.
ఇక జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. కాటారంలో అర్ధరాత్రి నుంచి ఆగకుండా వాన పడుతున్నది. దీంతో కాటారం-మహాదేవపూర్ జాతీయ రహదారిపై, దామరకుంట-కటుకుపల్లి మధ్యలో భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది. కాటారం-మేడారం రహదారిపై చింతకాని వాగు, మంథని-కాటారం రహదారిపై కొండంపేట వాగు ఉధృతంగా వరద పారుతున్నది. కొయ్యూరు వద్ద ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బొప్పారం, చిదినేపల్లి, శ్రీనివాస కాలనీలో ఇండ్లలోకి వరదనీరు చేరింది. మల్హర్ మండలం కుంభంపల్లి గ్రామం చుట్టూ వరదనీరు చేరింది.
ఇక ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పెంకవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. దీంతో పెంకవాగు, తిప్పాపురం, కొతగుంపు, కలిపాక గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. దీంతో గుర్తూరులో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కంటాయపాలెం-గుర్తూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.