Temperatures | హైదరాబాద్ : వానాకాలంలో ఎండలు, ఎండా కాలంలో వానలు కురవడం సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు ఒక మోతాదులోపే కనిపిస్తాయి. కానీ ఈ వర్షాకాలంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. నల్గొండలో అత్యధికంగా 37.5 డిగ్రీలు, ఖమ్మంలో 37 డిగ్రీలు, రామగుండంలో 35 డిగ్రీల చొప్పున వర్షపాతం నమోదైంది. అంటే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మండు వేసవిలో నమోదవుతుంటాయి. కానీ ఈసారి వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఎల్వీ రావు తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పెరుగుతుండడంతో ఉక్కపోత తప్పడం లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 5 దాటిన తరువాత కూడా ఎండ తీవ్రత కనిపిస్తోంది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.8డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.9డిగ్రీలు, గాలిలో తేమ 51శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఎల్వీ రావు తెలిపారు. సాధారణంగా వానాకాలంలో ఆగస్టు నెలలో కొంత ఎండలు ఉంటాయి. కాని ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే రికార్డు. కొన్ని కొన్ని సార్లు వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడే మార్పులకు ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. అయితే సాధారణంగా వాయువ్య ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీని వల్ల ఆ ప్రాంతం నుంచి వీచే గాలులు వేడిని తీసుకొస్తాయి. అంటే అక్కడి నుంచి వీచే గాలుల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీని వల్ల గాలిలో తేమ కూడా తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఉక్కపోత కూడా పెరుగుతుంది. ప్రస్తుతం వాయువ్య దిశ నుంచి వచ్చే గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్నాయి. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల 18 వరకు ఇవే పరిస్థితులు ఉండవచ్చు. ఆ తరువాత కొన్ని సిస్టమ్స్ అంటే ద్రోణి, ఉపరితల ఆవర్తనం వంటివి వచ్చే అవకాశాలున్నాయి. దీని వల్ల కొన్ని వానలు కురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తర తెలంగాణలోనే కొంత అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ నెలలో చెప్పుకోదగిన వానలు లేవన్నారు ఎల్వీ రావు.