నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తున్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తిప్పర్తిలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, త్రిపురారంలో 9.3, నార్కట్పల్లిలో 8.8, నిడమనూరు, అనుముల, మిర్యాలగూడ, పెద్దవూర, చిట్యాల, చండూరు, మునుగోడు మండలాల్లో భారీ వర్షం నమోదయింది.
కాగా, భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ సెంటర్లలో ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతుండగా ధాన్యం పెద్ద ఎత్తున కేంద్రాలకు వస్తుంది. ఇప్పటికే కొనుగోలు చేసినదానితోపాటు, కేంద్రాల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం కూడా భారీగానే ఉన్నది. ఇక కోతకు సిద్ధంగా చేలపై వరి సిద్ధంగా ఉన్నది. ఈ వర్షంతో చేను నేలబారి వడ్లు రాలే ప్రమాదం ఉన్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఈదురుగాలులో కూడిన వర్షం కురుస్తున్నది. భారీ వర్షంతో భువనగిరి పట్టణం జలమయమయింది. యాదగిరిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. యాదాద్రి ఆలయంలోని క్యూ కాంప్లెక్స్లోకి వర్షపునీరు చేరింది.
యాదగిరిగుట్టలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్లు, మోత్కూరులో 7.5, రామన్నపేటలో 6.9 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. భువనగిరి మండలంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.