హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండటంతో ఈ నెల 24 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీచేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. నైరుతి దిశ ఉపరితల గాలులు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.