హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.
హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం సైతం కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ నుంచి 3.1 కిలోమీటర్ ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు.