హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ర్టంలోని పలు చోట్ల ఈ నెల 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఏపీ, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. 20, 21 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.