హైదరాబాద్ : రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది ఒడిశా, చత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగిందన్నారు. అలాగే రుతుపవన ద్రోణి తీవ్ర అల్పపీడనం మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాకాతం వరకు విస్తరించిందన్నారు. వీటి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని తెలిపారు.
దీంతో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.