హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: మిజ్గాం తుఫాను ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, నల్లగొండ, జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 96.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పత్తి, మిర్చి, వరి పంటలకు నష్టం
మిగ్జాం తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వరి నేలకొరిగింది. కోసిన వరి మెదలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు పరదాలు, టార్పాలిన్లు కప్పు తూ రైతులు జాగ్రత్త పడుతున్నారు. సత్తుపల్లి ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా బుధవారం ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్
ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాజ్వే, లోతట్టు ప్రాంతాల వద్ద చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి ; సీఎల్పీ నేత రేవంత్రెడ్డి సూచన
మిజ్గాం తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత రేవంత్రెడ్డి కోరా రు. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, టార్పాలిన్ల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. తుఫాను ప్రభా వం ఎక్కువగా ఉన్న ఈశాన్య జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని ముందే అంచనా వేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరా రు. అవసరమైన చోట పునరావాస కేం ద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.