హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉత్తర- దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతున్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నాగర్కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్న వాతావరణ కేంద్రం.. ఆ తదుపరి 48 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వివరించింది. దీని ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది.