హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధిక లోటు వర్షపాతం నెలకొన్నది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అధికంగా 4.17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.