ఆదిలాబాద్ నెట్వర్క్/ఖలీల్వాడి, మే 22: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలిదుమారం హోరెత్తించింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరగంటకుపైగా వాన దంచికొట్టగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు సిరికొండ మండలం తాళ్లరామడుగులో భారీ వృక్షం నేలకొరిగింది. గాలిదుమారానికి బాన్సువాడలో నాలుగైదు గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఉట్నూర్లో వడ్ల కుప్పల మధ్య వర్షపు నీరు నిలవడంతో ధాన్యం తడిసింది. తలమడుగు మండలం ఉండం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్తు స్తంభం నేలకొరిగింది. తాంసిలో కొబ్బరి చెట్టు కూలడంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. మార్కెట్ యార్డులో జొన్నలు తడవడంతో ఇబ్బందులు పడ్డారు. కుంటాల మండలంలోని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. నిర్మల్ పట్టణంలో ధాన్యంపై కవర్లను కప్పేందుకు రైతులు పరుగులు తీశారు.