TS Weather | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ నైరుతి దిశ వైపునకు వంగి ఉందని వెల్లడించింది. తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొంది. దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని కేంద్రం సంచాలకురాలు నాగరత్న ప్రకటించారు.
సిద్దిపేటలో భారీ వర్షం
సిద్దిపేట జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిరుదొడ్డి మండలం కూడవెల్లి వాగులోని చెక్డ్యామ్లు నిండి దిగువకు వరద ఉరకలెత్తుతున్నది. దుద్దెడ శివారులో వరద నీటితో లోతట్టు ప్రాంతం జలమయమైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 16.3 సెం.మీ, కొండపాకలో 13, మిరుదొడ్డిలో 12.6, ధూల్మిట్టలో 12, సిద్దిపేట అర్బన్లో 11.6, కొమురవెల్లిలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది.