హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది.
ప్రస్తుతం కోస్తాంధ్ర తీరం నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగున్నదని, దీనితోపాటు గురువారం దక్షిణ కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితలద్రోణి ప్రభావంతో ఈ నెల 11వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.