హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకధాటి వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 98 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీంగల్ మండలం కప్పలవాగు చెక్డ్యామ్ పైనుంచి వర్షపు నీరు పారుతోంది. నవీపేట మండలం జన్నపల్లిలో పెద్ద చెరువు అలుగు పారుతోంది. లింగాపూర్ శివారులో వరద ధాటికి తుంగినిమాటు కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. తీగలవాగు ఉప్పొంగడంతో ఏర్గట్ల – మెట్పల్లి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాల ఇబ్బందుల పరిష్కారానికి 08462 – 220183 నంబర్ కు ఫోన్ చేయొచ్చు. కామారెడ్డి జిల్లాలో సాధారణంతో పోలిస్తే 70 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుండెగావ్ వద్ద పాల్సికర్ రంగరావు ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్ చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 9,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 358.10 అడుగులు. ఎడతెగని వర్షంతో గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. గడ్డెన్నవాగు పరివాహక ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని అధికారులు సూచించారు. సుద్దవాగు వైపు పశువులు తీసుకెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి వాన జోరుగా కురుస్తోంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్ జిల్లాలో ఎడతెగని వర్షాలతో స్వర్ణ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1178.5 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి 486 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లాలో 24 గంటల్లో 57.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లోకేశ్వరం మండలంలో 172.2 మి.మీ. వర్షం కురియగా, అత్యల్పంగా పెంబి మండలంలో 18 మి.మీ. వర్షపాతం నమోదైంది.