హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైనట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీఆర్ఎఫ్ ( Disaster Response Force ) బృందాలు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సమస్యలు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబర్లకు కాల్ చేయాలని నగర పౌరులకు కేటీఆర్ సూచించారు.
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్లో 17.9, హయత్నగర్లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్లో 15.6, ఎల్బీనగర్లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇక రాష్ర్ట వ్యాప్తంగా చూస్తే.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలోని చేగుంటలో అత్యధికంగా 227.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.