నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి, నూతనకల్, కట్టంగూర్, ఆత్మకూరు.ఎస్, నకరేకల్, చివ్వేంల, కేతేపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
కట్టంగూర్ పెద్ద చెరువు నిండు కుండలా మారింది. ఇంకా చాలా చెరువులు కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేటలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. నకరేకల్లో 11.7సెంటిమీటర్లు, కట్టంగూర్లో 11.5 సెంటిమీటర్లు, కేతేపల్లిలో 7.4, కనగల్లో 5.9, నార్కటపల్లిలో 4.3, నూతనకల్ 6, ఆత్మకూరు.ఎస్, చివ్వేంల మండలాల్లో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉదయం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు.
వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.