హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ములుగు జిల్లాలో అతిభారీ వర్షం, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో పలుచోట్ల భారీగా వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. మంగవారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురువొచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 30 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తూర్పు పడమర ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
వానజల్లు వరద పొంగు
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో పాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. నాగార్జునసాగర్కు 6,764 క్యూసెక్కుల వరద వస్తుండగా, శ్రీరాంసాగర్కు 3,761క్యూసెక్కులు, కడెంకు 1,621క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాణిహితలో 9,000 క్యూసెక్కులు, మూసీలో 2,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులకు కూడా స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది.