హైదరాబాద్: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad), నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా, బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంటలో పిడుగుపడి ఓ రైతుకు చెందిన మూడు బర్రెలు మరణించాయి. తాడూరు మండలం సిరిసవాడలో పిడుగుపడి ఓ బర్రె మృతిచెందింది.