హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువద్ద ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ రుతుపవనాల ద్రోణిలో కలిసిందని తెలిపింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బుధవారం సైతం పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీచేసింది.