హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలపైనే చెట్లు విరిగిపడ్డాయి. ఎకడికకడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గాలి వాన ధాటికి తెలంగాణ, ఏపీ భవన్ వద్ద ఉన్న వందేండ్ల నాటి భారీ వృక్షాలతో పాటు, పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి.
దీంతో అక్కడ నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భవన్ల అద్దాలు పగిలిపోయాయి. అద్దాలు తగిలి ముఖేశ్ అనే వ్యక్తి మెడపై గాయాలయ్యాయి. కూలిపోయిన భారీ చెట్లు సిబ్బంది నివాస సముదాయాలపై పడటంతో అవి స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు దెబ్బతిన్న భవనాలకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. పాత భవనాల్లో నివసిస్తున్న సిబ్బందిని ఖాళీ చేయిస్తామని చెప్పారు.